Hyderabad journalist : హైదరాబాద్లో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఈరోజు హైదరాబాద్ లోని జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ విషయంపై సంబంధిత శాఖలతో చర్చలు జరిపి త్వరలో స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో హౌసింగ్ సొసైటీల ప్రతినిధులు తమ సమస్యలు, అభ్యర్థనలు మంత్రికి వివరించారు. వాటిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, జర్నలిస్టుల అందరూ ఒకే మాట మీదకు రావడం శుభ పరిణామం అన్నారు. అన్నీ అంశాలను పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, సమాచార శాఖ కమిషనర్ ముకుంద రెడ్డితో పాటు వివిధ హౌసింగ్ సొసైటీల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో యేండ్ల తరబడి ఇంటి స్థలాల కోసం ఎదురు చూస్తున్న జర్నలిస్టులకు ఇంటి స్థలాల ప్రక్రియను ప్రభుత్వం మొదలు పెట్టడం శుభపరిణామమని, అలాగే రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో ఇంటి స్థలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టులకు కూడా వాటి కేటాయింపుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(TUWJ) రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరారు. ఇవ్వాళ సచివాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మంత్రికి వినతి పత్రాన్ని అందించగా, పొంగులేటి సానుకూలంగా స్పందిస్తూ, హైదరాబాద్ జర్నలిస్టులకు కేటాయింపు జరిగిన వెంటనే అన్నీ జిల్లాల్లో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు అందించే ప్రక్రియకు శ్రీకారం చూడతామని ఆయన హామీ ఇచ్చారు.

