Hanumakonda : గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని హనుమకొండ సాయినగర్లోని శ్రీ షిర్డీ సాయి సేవా సమాజ్ ఆధ్వర్యంలో జూలై 29న మహా అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, సాయి సేవా సమాజ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ తుంగతుర్తి శేషగిరిరావు, డైరెక్టర్–అడ్మిషన్స్, ఎస్ఆర్ యూనివర్సిటీ, వరలక్ష్మి దంపతులు, సాయి నిఖిత, సాయి మాన్విత, మౌర్య శశాంక్ తదితరుల సహకారంతో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయిబాబా భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు.
ఈ సందర్భంగా శ్రీ షిర్డీ సాయి సేవా సమాజ్ సభ్యులు, సాయినగర్, హనుమకొండ మాట్లాడుతూ, గురుపౌర్ణమి పర్వదినాన అన్నదానం చేయడం ద్వారా సాయిబాబా సేవలో భాగస్వాములు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. “అన్నదానం మహాదానం” అనే స్ఫూర్తితో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులకు సేవ చేయడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. శ్రీ సాయినాథుని ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన దాతలు, భక్తులు, సేవా సమాజ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
