New Collector : వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానాన్ని ఈ రోజు ఉదయం హనుమకొండ జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి చాహత్ బాజ్పాయ్ సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ కు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి రామల సునీత, ప్రధానార్చకులు శ్రీ భద్రకాళి శేషు, ధర్మకర్త శ్రీ బింగి సతీష్లు పూర్ణకుంభం, మంగళవాద్యాలతో ఘనస్వాగతం పలికారు. ముందుగా గోశాలలో గోవులకు గ్రాసం పెట్టి, ఆదిశంకరాచార్యులను, వల్లభ గణపతిని దర్శించిన అనంతరం ఆలయంలో ప్రదక్షిణ చేసి ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు. పూజానంతరం ప్రధానార్చకులు శ్రీ భద్రకాళి శేషు ఆధ్వర్యవమున అర్చకులు మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రములు బహూకరించి ప్రసాదములు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ శ్రీ రమేష్ రాథోడ్, తహశీల్దార్ శ్రీ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


